ధరణి పోర్టల్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి..ప్రారంభించనున్న సీఎం కెసిఆర్
By: Sankar Wed, 28 Oct 2020 07:53 AM
ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి వేదిక ఖరారైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దత్తత తీసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి ఈ మహత్తర కార్యక్రమానికి వేదికగా నిలవనున్నది. అక్కడి తాసిల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ పోర్టల్ను ప్రారంభిస్తారు.
అనంతరం జర్నలిస్టులతో కలిసి లంచ్ చేస్తారు. ఆ తర్వాత మూడుచింతలపల్లి శివారులో ఏర్పాటుచేయనున్న బహిరంగసభలో పాల్గొని ప్రజలకు పోర్టల్కు సంబంధించిన సందేశాన్ని ఇస్తారని అధికారులు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా అన్నింటినీ పరిశీలించారు. అంతకుముందు ధరణి పోర్టల్ నిర్వహణపై తాసిల్దార్లు, నాయబ్ తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్లకు సీఎస్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి నిర్వహణను వివరించారు.
స్లాట్బుకింగ్, సిటిజన్ పోర్టల్, సేల్, సక్సేషన్, పార్టిషన్ అంశాలపై మాట్లాడారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ అయ్యాక నిర్దేశిత సమయానికి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తే పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుందని సీఎస్ తెలిపారు. ధరణి దేశంలోనే ట్రెండ్సెట్టర్గా నిలుస్తుందని చెప్పారు..