వర్షాలు తగ్గడంతో శ్రీశైలం డ్యాం అన్ని గేట్లు మూసివేత
By: chandrasekar Mon, 02 Nov 2020 10:00 AM
వర్షాలు తగ్గడంతో శ్రీశైలం డ్యాం అన్ని గేట్లు మూసివేయబడింది.
కృష్ణా నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎట్టకేలకు
మూతపడ్డాయి. ఈ సీజన్లోనే గరిష్టంగా మూడు వారాలకుపైగా నిర్విఘ్నంగా తెరచుకున్న
శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేశారు.
ప్రస్తుతం వర్షాలు అసలే లేవు దీనికి తోడు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి వరద నీటి
విడుదల అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. రెండు రోజులుగా కృష్ణా నదిలో వరద ప్రవాహం
క్రమంగా తగ్గిపోతూ వస్తుండగా 56 వేల క్యూసెక్కులకుపడిపోయిన వెంటనే నీటి విడుదలను
రెండు గేట్లకు పరిమితం చేశారు. ఆదివారం ఉదయం 50వేలకు పడిపోవడంతో తెరచిన రెండు గేట్లలో ఒక గేటును
అధికారులు మూసివేశారు. ఇంకా తగ్గిపోతుండడంతో ఆఖరి గేటును కూడా మూసేశారు. డ్యాం కు
ఉన్న మొత్తం గేట్లన్నీ మూసేసినా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్
కు నీటి విడుదల కొనసాగుతోంది.
ఇక్కడ ప్రస్తుతం శ్రీశైలం
డ్యాం వద్ద ఇన్ ఫ్లో 43 వేల 773 క్యూసెక్కులు ఉంది. జూరాల నుండి 47 వేల
క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తుండగా.. తుంగభద్ర నుండి సుంకేశుల
మీదుగా మరో 6 వేల 710 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల
చేస్తున్నారు.ఎగువన పోతిరెడ్డిపాడుకు 7 వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు మరో రెండు
వేల క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తుండడంతో శ్రీశైలం డ్యాంకు 43 వేల 773
క్యూసెక్కుల వరద చేరుకుంటోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885
అడుగులతో 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 884.90 అడుగులతో 215.3263 టీఎంసీలు ఉంది. ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్
కేంద్రంలో 27 వేల 216
క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా తెలంగాణ పరిధిలోనీ
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో 12 వేల 713 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి
చేస్తున్నారు. విద్యుత్ వినియోగానికి తప్ప వర్షాల కోసం డ్యామ్ గేట్లు తెరవడం లేదు.