- హోమ్›
- వార్తలు›
- భారత కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం లోపు అందుబాటులోకి వస్తుంది.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు సంజయ్ రాయ్
భారత కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం లోపు అందుబాటులోకి వస్తుంది.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు సంజయ్ రాయ్
By: Sankar Fri, 11 Sept 2020 05:19 AM
ఆక్స్ఫర్డ్ టీకా కొవిషీల్డ్పై ట్రయల్స్ ఆగిపోవడంతో కరోనా వ్యాక్సిన్ తయారీ మరింత ఆలస్యం అవుతుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి అనుమానం ఏం అక్కర్లేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు సంజయ్ రాయ్ చెప్పారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. కొవాగ్జిన్ ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నది. అక్టోబరు చివరికి ఈ ట్రయల్స్ పూర్తి అవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు టీకా వేసుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదన్నారు.
కాగా ఆక్స్ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్'పై క్లినికల్ హ్యూమన్ ట్రయల్స్ను నిలిపివేస్తున్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకాపై ట్రయల్స్ నిర్వహిస్తున్న ఔషధ తయారీ కంపెనీ అస్ట్రాజెనెకా మళ్లీ పరీక్షలు ప్రారంభించేవరకు తాము కూడా ట్రయల్స్ నిర్వహించబోమని ఓ ప్రకటనలో పేర్కొన్నది. టీకా వేసుకున్న ఓ వలంటీరుకు ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
కొవిషీల్డ్ టీకా ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నది. వలంటీరులో నరాల సమస్యలు తలెత్తడంతో టీకా సమర్థతపై అనేక సందేహాలు తలెత్తున్నాయి. సమస్యకు కారణం టీకానేనా, వేరే ఏదైనా అంశమా అన్నది స్పష్టం చేయాలని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు, వైద్యనిపుణులు, చట్టసభల ప్రతినిధులు అస్ట్రాజెనెకాను కోరుతున్నారు.