పెట్టిన డబ్బులకు రెట్టింపు పలికిన ఏజెంట్ ఆత్రేయ సినిమా రీమేక్ హక్కులు..
By: Sankar Fri, 24 July 2020 10:24 AM
ఒకోసారి చిన్న సినిమాలు అందరిని ఆశ్చర్య పరుస్తూ అద్భుత విజయాలను దక్కించుకుంటాయి ..అలా గతఏడాది హీరో నవీన్ పొలిశెట్టి నటించిన "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"కూడా ఘన విజయం సాధించింది . థ్రిల్లర్, డిటెక్టివ్ తరహాలో రూపు దిద్దుకున్న ఈ సినిమా మూస సినిమాలు చూస్తూ విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇచ్చింది.
దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన ఈ సినిమా గతేడాది జూన్ 21న విడుదలవగా నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో హీరోగా పరిచయమైన నవీన్ పొలిశెట్టి సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా నడిపించారు. రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే రూపొందించారు. త్వరలోనే దీనికి సీక్వెల్ తీయాలని ఆలోచనలో పడ్డారు స్వరూప్.
కాగా ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం ప్రధాన పాత్రలో తమిళంలో ఈ చిత్రం రీమేక్ కానుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. బడ్జెట్ కన్నా రెట్టింపు డబ్బులకు రీమేక్ హక్కులు రేటు పలకడం విశేషం.
రీమేక్లో ఎవరు నటించనున్నారు? రీమేక్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే చిన్న సినిమాలైన విశ్వక్సేన్ 'హిట్', ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహా 'మత్తు వదలరా' సినిమాలు కూడా బాలీవుడ్ రీమేక్ల దిశగా అడుగులు పడిన విషయం తెలిసిందే