కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా దొరికిన మెదక్ అడిషనల్ కలెక్టర్
By: Sankar Wed, 09 Sept 2020 11:46 AM
తెలంగాణాలో ప్రభుత్వ అధికారులు ఒకరిని మించి మరొకరు లంచాలు తీసుకోవడంలో పోటీ పడుతూ లంచాలు తీసుకోవడంలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.మొన్నటికి మొన్న కీసర ఎమ్మార్వో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం మరవకముందే తాజాగా ఏకంగా ఒక జిల్లా అడిషనల్ కలెక్టర్ గా ఉన్న అధికారి భారీ ఎత్తున్న లంచం తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది..
మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్.. కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే మందలించాల్సింది పోయి... కలెక్టర్ లంచం తీసుకోవడం విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారిగా ఉండి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోవడం ఇదే తొలిసారి.
నర్సాపూర్ డివిజన్లోని తిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం ఏకంగా రూ.1.40 కోట్లు డిమాండ్ చేశారు నగేష్.. ఈ భూవివాదం పరిష్కారంలో... కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం డబ్బులు ఇవ్వడానికి ఏకంగా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు.
రంగంలోకి దిగిన అధికారులు.. మాచవరంలోని నగేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్కుతో పాటు ప్రాపర్టీ అగ్రిమెంట్, ఆడియో క్లిప్లతో సహా దొరికిపోయాడు నగేష్.. లంచంగా కోటి 12 లక్షల డబ్బు, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా నగేష్ రాయించుచున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. నగేష్ వ్యవహారంతో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.