Advertisement

  • భారత్ లో ఆక్స్ ఫోర్డ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలిసింది ..

భారత్ లో ఆక్స్ ఫోర్డ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలిసింది ..

By: Sankar Wed, 28 Oct 2020 7:55 PM

భారత్ లో ఆక్స్ ఫోర్డ్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలిసింది ..


భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ర్టాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ డిసెంబర్‌ నాటికి సిద్ధమవుతుందని పుణేకు చెందిన ఆ సంస్థ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా వెల్లడించారు. పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో తొలి బ్యాచ్‌ 2021 రెండు లేదా మూడో త్రైమాసికంలో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.

భారత్‌లో డిసెంబర్‌ నాటికి మానవ పరీక్షలు పూర్తవుతాయని, బ్రిటన్‌లో పరీక్షలు కూడా ముగిసిన పక్షంలో భారత్‌లో జనవరి నాటికి వ్యాక్సిన్‌ లాంఛ్‌ చేస్తామని ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదార్‌ పూనావాలా పేర్కొన్నారు. బ్రిటన్‌లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్‌ పరీక్షలు పూర్తయి..వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రత మెరుగ్గా ఉందని వెల్లడైతే అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కొన్ని వారాల ప్రక్రియని, దీనిపై తాను ఊహించి చెప్పలేనని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

ఇక భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు బుధవారం నాటికి 80 లక్షల మార్క్‌కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1,20,000కు పెరిగింది. 43,893 తాజా పాటిటివ్‌ కేసులతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 79,90,322కు ఎగబాకింది. ఇక తాజాగా వైరస్ కారణంగా బుధవారం 508 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags :
|

Advertisement