Advertisement

Flash News: సినీ నటి విజయశాంతి ట్వీట్ వైరల్...!

By: Anji Sun, 08 Nov 2020 5:44 PM

Flash News: సినీ నటి విజయశాంతి ట్వీట్ వైరల్...!

తెలంగాణ కాంగ్రెస్‌ నేత, సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీపై జాలి వ్యక్తం చేస్తూ ఆదివారం చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆమె బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమని అర్థమవుతోంది.

తెలంగాణలో బీజేపీ బలపడిందంటూ ఆమె అన్నారు. కాంగ్రెస్ నేతల్లో కొందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్‌లోకి లాక్కున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీలోకి ఫిరాయింపులు చేయించారని విజయశాంతి ఆరోపించారు.

కాంగ్రెస్‌ను బలహీనపరచడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్‌కు.. ఇప్పుడు తెలంగాణ బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని అన్నారు.

‘‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి... ఇంకొందరిని భయపెట్టి... ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు.

కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి.’’ అని విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం విజయశాంతి బీజేపీలో చేరబోతుందన్న కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాలోచనలు జరపడం ఆ కథనాలకు మరింత ఊపునిచ్చింది. వెంటనే తేరుకున్న కాంగ్రెస్ నేతలు ఆమె పార్టీ వీడకుండా రాయబారాలు నెరిపారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ కూడా స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆమెతో భేటీ అయ్యారు. పలువురు కాంగ్రెస్ నేతలు విజయశాంతి పార్టీ మారబోరని స్పష్టం చేస్తూ వచ్చారు.

Tags :

Advertisement