విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు ..కేంద్రాన్ని అభ్యర్దించిన సోను సూద్
By: Sankar Wed, 26 Aug 2020 12:07 PM
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే..దాదాపు కరోనా వచ్చి ఆరు నెలలు అవుతున్న దేశంలో కరోనా కేసులు తగ్గకపోగా అంతకంతకు పెరుగుతూ ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదు అయితున్నాయి..అయితే ఒకవైపు కరోనా ఇలా ఉంటె మరో వైపు జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్13న నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ సెప్టెంబర్ 27న జరగనున్నాయి. ఈ పరీక్షలకు 26 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మరోవైపు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దని, పరీక్షలను వాయిదా వేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాపై నటుడు సోనూ సూద్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘ఒక వైపు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, మరో వైపు ముంచెత్తుతున్న వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) నిర్వహించడం సరైంది కాదు. విద్యార్థుల విషయంలో శ్రద్ధ వహించాలి. వారి ప్రాణాలను రిస్క్లో వేయలేం. ఈ పరీక్షలను వాయిదా వేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.