నిర్మాతగా ప్రయాణం ప్రారంభించిన నటుడు 'కృష్ణుడు"
By: chandrasekar Thu, 06 Aug 2020 1:04 PM
ప్రముఖ నటుడు
కృష్ణుడు.. వినాయకుడు’, ‘విలేజ్లో వినాయకుడు’ చిత్రాల ద్వారా కథానాయకుడుగా
పరిచయమై తర్వాత నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్య క్రియేషన్స్ అనే
నిర్మాణ సంస్థను ఆయన స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్
ఫ్రెండ్’ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ
సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
నిర్మాత కృష్ణుడు ఈ
చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్
ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా చేసాం. ఫైనల్ అవుట్పుట్ చూశాక
సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదరించారు.
నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.
త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’’ అని అన్నారు.
లోతుగడ్డ జయరామ్ను ఈ
సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు
పరిచయం చేస్తున్నారు కృష్ణుడు. ఇదిలా ఉంటే, కృష్ణుడు
తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాకు చెందిన జమీందారీ కుటుంబంలో జన్మించారు.
కృష్ణుడు కుటుంబంలో అంతా ఉన్నత విద్యను అభ్యసించినవారే. కానీ, ఈయనకు మాత్రం సినిమాలంటే పిచ్చి.
దర్శకుడు వంశీ రాజోలులో షూటింగ్లు
చేస్తున్నప్పుడు ఆయన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమాల్లోకి వచ్చానని కృష్ణుడు చాలా
సార్లు చెప్పారు. చదువు పేరుతో హైదరాబాద్ వచ్చి సినిమాల్లో ప్రయత్నాలు మొదలు
పెట్టారాయన. పలు సినిమాల్లో కామెడీ పాత్రలు చేసిన కృష్ణుడు.. ‘వినాయకుడు’ సినిమాతో
హీరోగా మారారు. నటన నుంచి విరామం తీసుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా పరిచయం
కాబోతున్నారు.