Advertisement

హాస్పిటల్ నుంచి అభిషేక్ బచ్చన్ ట్వీట్

By: chandrasekar Mon, 13 July 2020 5:35 PM

హాస్పిటల్ నుంచి అభిషేక్ బచ్చన్ ట్వీట్


బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో సహా వారి కుటుంబంలోని నలుగురుకి కరోనా సోకింది. మొదట అమితాబ్‌కు కరోనా పాజిటివ్ అని తేలగానే శనివారం సాయంత్రం ఆయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు. ఆ వెంటనే ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో తన తండ్రితోపాటు అభిషేక్ కూడా హాస్పిటల్‌లో చేరారు.

ఆ తరవాత బచ్చన్ ఫ్యామిలీలోని మిగిలిన సభ్యులందరికీ కరోనా టస్టులు చేశారు. ఈ టెస్టుల రిపోర్ట్స్ ఆదివారం వచ్చాయి. ఆదివారం వచ్చిన రిపోర్ట్స్‌లో అభిషేక్ బచ్చన్ భార్య, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు, కుమార్తె ఆరాధ్యకు పాజిటివ్ అని తేలింది. అభిషేక్ తల్లి జయా బచ్చన్, సోదరి శ్వేతా నంద, ఆమె కుమారుడు అగస్త్య నంద, కుమార్తె నవ్య నవేలికి కరోనా నెగిటివ్ వచ్చింది.

అయితే, పాజిటివ్ వచ్చిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఎక్కడ చికిత్స పొందుతున్నారు అనే విషయంలో అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చింది. వారిద్దరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వారు మాకు తెలియజేశారు. అవసరమైన మేర వారు సహాయం చేస్తున్నారు. నా తల్లి సహా మిగిలిన కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని అభిషేక్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం తన తండ్రి, తాను మాత్రమే హాస్పిటల్‌లో ఉన్నామని, డాక్టర్లు చెప్పే వరకు ఇక్కడే ఉంటామని అభిషేక్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి భద్రంగా ఉండాలని కోరారు. నిబంధనలను పాటించాలన్నారు.

కాగా, ప్రస్తుతం అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నానావతి హాస్పిటల్ డాక్టర్లు ఇప్పటికే వెల్లడించారు. అమితాబ్ బచ్చన్‌‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అమితాబ్ సైతం హాస్పిటల్ నుంచి ఒక వీడియో సందేశాన్ని అభిమానులకు అందించారు.

Tags :
|

Advertisement