ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న మహిళ... ఆ తొమ్మిదో భర్త చేతిలో హత్య
By: chandrasekar Thu, 30 July 2020 8:38 PM
హైదరాబాద్లోని పహాడీ
షరీఫ్లో దారుణం జరిగింది. ఇతరులతో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో భార్యను చంపేశాడు
భర్త. కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని
శ్రీరాంకాలనీలో నివసిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం
సాగిస్తున్నాడు. ఇటీవల నాగరాజుకు స్థానికంగా ఉండే వరలక్ష్మి (30)తో
పరిచయం ఏర్పడింది. ఆమె కాటేదాన్లోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తోంది.
వరలక్ష్మికి అప్పటికే
భర్త, కుమారు
ఉన్నారు. ఐనప్పటికీ నాగరాజుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో భర్తను వదలేసి
రెండేళ్ల క్రితం నాగరాజును వివాహం చేసుకుంది. వీరి కాపురం కొన్ని రోజుల పాటు
సజావుగానే సాగింది. ఐతే వరలక్ష్మి కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజుకు
నచ్చలేదు. అలా చేయవద్దని చాలాసార్లు హెచ్చరించినా వరలక్ష్మి ప్రవర్తనలో మార్పు
రాలేదు. ఈ విషయమై ఇరువురి మధ్య నిత్యం గొడవ జరిగేది.
మంగళవారం ఉదయం కూడా భార్యాభార్తల
మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన నాగరాజు వరలక్ష్మిని గొంతుకోసి
చంపేశాడు. అనంతరం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై
పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరలక్ష్మి
అంతకు ముందే ఎనిమిది పెళ్లిళ్లు అయ్యాయని నాగరాజు తొమ్మిదో భర్త అని దర్యాప్తులో
తేలింది. ఇతర వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, భర్తలతో గొడవపడి మరో పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటుగా
మారిందని పోలీసులు తెలిపారు. ఇటీవల కూడా అలాంటి గొడవే జరిగిందని.. ఈ క్రమంలోనే
వరలక్ష్మిని నాగరాజు హత్యచేశాడని తెలిపారు.