బెంగళూరులో మట్టి జారడంతో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం
By: chandrasekar Thu, 30 July 2020 7:46 PM
బెంగళూరు నగరం ఉలిక్కి
పడింది. స్థానిక కపిల్ థియేటర్ సమీపంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా
కుప్పకూలింది. సమయానికి ఆ హోటల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంగళవారం
రాత్రి సుమారు 10.15 గంటలకు భవనం కింద ఉన్న మట్టి నెమ్మదిగా జారడం
మొదలైంది. దీంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ భవనం సమీపంలోనే కపాలి
థియేటర్ ఉండేది. 2017లో దాన్ని కూల్చివేసి మల్టిప్లెక్స్ నిర్మాణం కోసం
పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 80 అడుగుల లోతు వరకు
తవ్వకాలు జరిపారు. అయితే, అక్కడి మట్టి పెళుసుగా ఉండటం వల్ల చుట్టుపక్కల
భవనాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న హోటల్, లాడ్జి
భవనానికి సోమవారం బీటలు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమై భవనాన్ని ఖాళీ చేయించారు.
మంగళవారం రాత్రి భవనం
కింద ఉన్న మట్టి మొత్తం జారిపోవడం మొదలైంది. దీంతో భవనం కూడా కుప్పకూలింది. అక్కడి
మట్టిని సరిగ్గా పరిశీలించకుండా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని
అధికారులు చెబుతున్నారు. నిర్మాణ సంస్థ చుట్టుపక్క భవనాలకు నష్టం లేకుండా పనులు
చేయడంలో విఫలమైందని తెలిపారు. కూలిన భవనానికి నష్టపరిహారం చెల్లించాలని యజమాని
డిమాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా
మారింది.