కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొన్నట్టు నైజీరియా శాస్త్రవేత్తల బృందం ప్రకటన
By: chandrasekar Wed, 24 June 2020 11:52 AM
కరోనా వైరస్ మహమ్మారికి
వ్యాక్సిన్ కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము కరోనా వైరస్కు
వ్యాక్సిన్ కనుగొన్నట్టు నైజీరియా శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. వ్యాక్సిన్
కనుగొన్నట్టు నైజీరియన్ యూనివర్సిటీలు శుక్రవారం ప్రకటించాయని స్థానిక
మీడియా వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ను ఆఫ్రికన్ల కోసం అభివృద్ధి చేశామని పరిశోధనకు
నేతృత్వం వహించిన అడిలెక్ యూనివర్సిటీ మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ, బయో
ఇన్ఫర్మాటిక్స్ ప్రత్యేక నిపుణుడు, డాక్టర్ ఒలడిపో కొలవోల్ ప్రకటించినట్టు ది
గార్డియన్ నైజీరియా పత్రిక తెలిపింది.
అయితే, ఈ టీకా
అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని ఒలడిపో
అన్నారు. వ్యాక్సిన్కు మరిన్ని క్లినికల్ ట్రయల్స్, విశ్లేషణ
అవసరమని, వైద్య అధికార వర్గాల నుంచి అనుమతుల రావాల్సి ఉంటుందని
ఆయన పేర్కొన్నారు. సార్స్ కొవ్2 జన్యుక్రమం కోసం ఆఫ్రికా మొత్తం విస్తృతంగా
అన్వేషించినట్టు ఆయన వెల్లడించారు.
వ్యాక్సిన్ కనుక్కోవడం
వాస్తవమేనని ప్రీసియస్ కార్నర్స్టోన్ వర్సిటీ ప్రొఫెసర్ జూలియస్ ఒలోక్
సైతం ధ్రువీకరించారు. ‘వ్యాక్సిన్ కనుగొన్నది నిజమే. మేం చాలాసార్లు ప్రయోగాలు
చేసి విశ్లేషించాం. ఆఫ్రికన్లే లక్ష్యంగా దీనిని తయారు చేశాం. ఇతరులు సైతం
దీనిని వినియోగించవచ్చు. ఇది సమర్ధవంతంగా పనిచేస్తుంది. నకిలీది కాదు అంకితభావానికి
వచ్చిన ఫలితం. చాలామంది శాస్త్రవేత్తలు ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. ప్రపంచవ్యాప్తంగా
ఈ వ్యాక్సిన్ అవసరం ఎంతో ఉంది. అందుకే మేం దీనిపై దృష్టిసారించాం’ అని ఆయన వివరించారు.
మరోవైపు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా
సహా అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు సాగుతుండగా వేలాది
కోట్లు వెచ్చిస్తున్నాయి.