Advertisement

భారీ వర్షాలతో పరుగులు తీస్తున్న నీటి ప్రవాహం

By: chandrasekar Wed, 14 Oct 2020 5:45 PM

భారీ వర్షాలతో పరుగులు తీస్తున్న నీటి ప్రవాహం


మూడు రోజులుగా భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే నిండి ఉన్న ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తడంతో వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి.

కర్ణాటకలోని ఆల్మట్టి మొదలు నాగార్జునసాగర్‌ వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ అధికారులు గేట్లను ఎత్తి వరదను నదిలోకి వదులుతున్నారు. జూరాలలో 25 గేట్లు, శ్రీశైలంలో పది గేట్లు, నాగార్జున సాగర్‌లో 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో 30 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.80 టీఎంసీలకు గాను మంగళవారం సాయంత్రానికి 9.32 టీఎంసీలకు చేరింది.

ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో శ్రీరాజరాజేశ్వర జలాశయంలోని నాలుగు గేట్లు, కరీంనగర్లోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్‌ఎండీలో 24.034 టీఎంసీలకు ప్రస్తుతం 23.602 టీఎంసీల నిల్వ ఉన్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్‌కు వరద పోటెత్తడంతో 20 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దిగువన మంథని మండలం సిరిపురంలో పార్వతీ బరాజ్‌లోనూ 60 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో సరస్వతీ బరాజ్‌కు వదులుతుండడంతో 110 కిలోమీటర్ల గోదావరి తీరం నిండుకుండలా కనిపిస్తున్నది.

Tags :

Advertisement