కోహ్లిని ఆకర్షిస్తున్న రికార్డు
By: chandrasekar Mon, 28 Sept 2020 9:11 PM
దుబాయ్: ఐపీఎల్-13లో భాగంగా ఈరోజు(సోమవారం) ముంబై ఇండియన్స్-ఆర్సీబీల
మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ల్లో ఇరు జట్లు తలో మ్యాచ్లో
గెలిచి మరో విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. దాంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం
ఉంది. కాకపోతే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తోంది. ముంబైతో
మ్యాచ్లో కోహ్లి రాణించి 85 పరుగులు చేస్తే అరుదైన రికార్డును నమోదు చేస్తాడు.
టీ20 ఫార్మాట్లో 9 వేల పరుగుల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్గా
రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకూ 283 టీ20 మ్యాచ్ల్లో కోహ్లి 8, 915 పరుగులు చేశాడు. ఒక భారత క్రికెటర్గా ఇది అత్యధిక టీ20 పరుగుల రికార్డు.
కానీ మరో 85 పరుగులు చేస్తే 9 వేల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్గా
కోహ్లి నిలుస్తాడు. ఇప్పుడు కోహ్లిని ఆ రికార్డు ఊరిస్తోంది. ఈ రికార్డు సాధిస్తే
ఓవరాల్గా కోహ్లి ఏడో క్రికెటర్ అవుతాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో క్రిస్
గేల్(13, 296) తొలిస్థానంలో ఉండగా, కీరోన్ పొలార్డ్(10, 238) రెండో స్థానంలో ఉన్నాడు.
బ్రెండన్ మెకల్లమ్(9,922) మూడో స్థానంలో, షోయబ్ మాలిక్(9,906) నాల్గో స్థానంలో ఉన్నారు.
ఇక డేవిడ్ వార్నర్(9,318), అరోన్ ఫించ్(9,088)లు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు.కింగ్స్ పంజాబ్తో
జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘోరంగా విఫలమైంది. ఏకంగా 97 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రధానంగా కోహ్లి పరుగులు చేయడానికి తీవ్ర
ఇబ్బందులు పడి చివరకు నిరాశపరిచాడు. అంతకుముందు సన్రైజర్స్తో మ్యాచ్లో కూడా
కోహ్లి బ్యాటింగ్లో ఆకట్టుకోలేదు. దాంతో కోహ్లిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ రోజు
బ్యాట్తో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కోహ్లిపై ఉంది.