తాజా అధ్యయనంలో బీసీజీ టీకా వృద్ధులకూ సురక్షితమేనని తేలింది
By: chandrasekar Sat, 05 Sept 2020 09:41 AM
తాజా అధ్యయనంలో బీసీజీ టీకా వృద్ధులకూ సురక్షితమేనని తేలింది. ప్రస్తుతం కరోనా వల్ల వృద్దులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. క్షయ వ్యాధి నిర్మూలన కోసం చిన్నారులకు ఇచ్చే బీసీజీ టీకా వృద్ధులకూ సురక్షితమేనని తాజా అధ్యయనంలో తేలింది. వృద్ధుల్లోనూ ఈ టీకా సమర్థంగా పనిచేస్తుందని, ఇది రకరకాల వ్యాధి కారకాల దాడి నుంచి వారిని రక్షిస్తుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ టీకా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా వృద్ధుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుందా లేదా అనే విషయాన్ని మాత్రం పరిశోధకులు స్పష్టం చేయలేదు. దీని వల్ల శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు తక్కువగా నమోదయినట్లు తెలిపారు. బీసీజీ వ్యాక్సిన్ ద్వారా వారిలో పెరిగే ట్రెయిన్డ్ ఇమ్యూనిటీ నుంచి వృద్ధులు లబ్ధి పొందుతారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజా అధ్యయనం కోసం పరిశోధకులు మొత్తం 198 మంది వృద్ధులను ఎంచుకున్నారు. వారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యేముందు ప్రతి ఒక్కరికి సర్వరోగ నివారణ మాత్రలు గానీ, బీసీజీ వ్యాక్సిన్గానీ ఇచ్చారు.
ఈ వైద్యం అందుకున్న వారిని ఏడాదిపాటు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వారిలో టీకా పనితీరును అంచనా వేశారు. ఇందువల్ల హానికర వ్యాధుల బారినపడిన వృద్ధుల్లో ఇన్ఫెక్షన్లను బీసీజీ టీకా ఏ మేరకు నిరోధించగలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా కరోనా మహమ్మారి విస్తరణకు రెండేండ్ల ముందుగానే తమ పరిశోధన ప్రారంభమైందని రాడ్బౌండ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకుడు, అధ్యయనం సహ రచయిత మిహాయ్ నెటియా చెప్పారు.
ఈ పరిశోధనకు గాను మేము 65 ఏండ్లకుపైగా వయసు కలిగిన వృద్ధులను ఆస్పత్రిలో ఎంచుకున్నామని, డిశ్చార్జి సమయంలో వారిలో కొందరికి బీసీజీ వ్యాక్సిన్ను, మరికొందరికి సర్వరోగ నివారణ మాత్రలను ఇచ్చామని నెటియా తెలిపారు. సాధారణంగా వృద్ధుల్లో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లపై బీసీజీ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలిందని అధ్యయనం మరో సహ రచయిత ఎవాంగెలస్ బార్బౌలిస్ చెప్పారు. అయితే ఈ పరిశోధనలో తేలిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీసీజీ టీకా ప్రధానంగా శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లపై ఎఫెక్టివ్గా పనిచేస్తున్నదని తెలిపారు. సర్వరోగ నివారణ మాత్రలు తీసుకున్న వృద్ధుల కంటే బీసీజీ టీకా తీసుకున్న వృద్ధుల్లో శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు 75
శాతం తక్కువగా నమోదయ్యాయని ఎవాంగెలస్ వెల్లడించారు. కానీ ఇది కరోనా బాధితులకి ఎంతమేర రక్షణగా ఉంటుందనేది తేలాల్సివుంది.