Advertisement

  • విశాఖలో కొత్త తరహాలో దోపిడీ...దొంగలు చేస్తున్న మోసాన్ని చూసి పోలీసులే షాక్

విశాఖలో కొత్త తరహాలో దోపిడీ...దొంగలు చేస్తున్న మోసాన్ని చూసి పోలీసులే షాక్

By: chandrasekar Mon, 24 Aug 2020 11:48 PM

విశాఖలో కొత్త తరహాలో దోపిడీ...దొంగలు చేస్తున్న మోసాన్ని చూసి పోలీసులే షాక్


విశాఖ క్రైం పోలీసులు ఢిల్లీ కేంద్రంగా బ్యాంక్‌ ఏటీఎంలలో కొత్త తరహాలో దోపిడీలకు పాల్పడే బ్యాచ్‌ను అరెస్ట్‌ చేశారు. ఏటీఎంలలో ఈ గ్యాంగ్ చేస్తున్న మోసాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జులై నెల 7, 8న ఏటీఎంలో రూ.1.03 లక్షలు దొంగతనం జరిగిందని బిర్లా జంక్షన్‌ స్టేట్‌ బ్యాంక్‌ అకౌంటెంట్‌ గజ్జెల సూర్య భాస్కరరావు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏటీఎంలో వరుసగా రూ.19,500, రూ.19,500, రూ.39,000 డబ్బును ఇద్దరు వ్యక్తులు డ్రా చేసినట్లు గుర్తించారు. అదే సమయంలో ఈ నెల 21న ఎవరో ఇద్దరు అనుమానితులు బ్యాంక్‌ ఏటీఎంలలో దోపిడీ చేస్తున్నారని విజయవాడ పోలీసుల నుంచి విశాఖ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వెంటనే అదే రోజు బిర్లా జంక్షన్‌ ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న హర్యానాకు చెందిన అకిబ్‌ఖాన్, ముబారక్‌లు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు.

ఆ ఇద్దర్ని విచారించగా ఈ నెల 19న ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి డాబాగార్డెన్స్‌లోని ఓ లాడ్జీలో దిగామని ఓ ఆటోమొబైల్స్‌లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులు లేని ఎస్‌బీఐ ఏటీఎంలు ఎక్కడెక్కడ వెతికారు. ఏటీఎం మిషన్లను తెరిచే మూడు నకిలీ తాళాలను ఉపయోగించి డబ్బు దొంగలించారు. హర్యానా నుంచి ఇక్కడికి వచ్చే సమయంలో ఈ ఇద్దరు తమ స్నేహితుల ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు తీసుకొస్తారు. ఏటీఎంలో కార్డు పెట్టి విత్‌డ్రా చేస్తారు. డబ్బు ఏటీఎం నుంచి బయటకు వచ్చే సమయంలో వారి దగ్గర ఉన్న నకిలీ తాళాలతో ఏటీఎం మిషన్‌ను ఆపేస్తారు. డబ్బు అకౌంట్ నుంచి డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ వస్తుంది. మిషన్‌ ఆగిపోయిందని కస్టమర్ నేరుగా కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే వారికి ఎర్రర్‌ చూపిస్తుంది. వారు సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ని సంప్రదించాలని సూచిస్తారు. బ్యాంక్‌ మేనేజర్‌ అకౌంట్‌లో కూడా టెక్నికల్‌ ఎర్రర్‌ చూపుతుంది. ఈ డబ్బు సంబంధిత బ్యాంక్‌ మేనేజర్‌ అకౌంట్‌లోనే చూపిస్తుంది. మిషన్‌ నుంచి వచ్చిన డబ్బును నిందితులు తీసుకుని వెళ్లిపోతారు. నిందితుల నుంచి 34 ఏటీఎం కార్డులు, ఒక స్కూటీ, రూ.76 వేలు డబ్బు, మూడు నకిలీ తాళాలు, రెండు స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :
|

Advertisement