భార్య వివాహేతర సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తి ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన భర్త
By: chandrasekar Wed, 05 Aug 2020 7:05 PM
తన భార్య వివాహేతర సంబంధం
పెట్టుకుందని భావిస్తున్న వ్యక్తి ఇంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. భార్య వేరొక
పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానంతో ఓ ఇంటికి నిప్పుపెట్టాడు
ఆమె భర్త. నారాయణపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లిలో ఈ ఘటన జరిగింది.
స్థానికులు తెలిపిన
వివరాల ప్రకారం బెజ్జింకి మండలం ముత్తనపేటకు చెందిన ఓ వ్యక్తికి చిన్నకోడూరు మండలం
చెల్కలపల్లి చెందిన మహిళతో కొన్ని నెలల క్రితం వివాహమైంది. వివాహమైన కొన్నాళ్ల
తర్వాత ఉపాధి కోసం అతడు ముంబైకి వెళ్లాడు. భార్యను ఆమె పుట్టినిల్లయిన
చెల్లపల్లిలో వదలిపెట్టాడు. ఆ మహిళ అదే గ్రామంలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి తరచూ
వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆమె భర్త తిరిగి స్వగ్రామానికి
వచ్చాడు.
ఐతే భార్య తనతో సరిగా
ఉండడం లేదని అతడు అనుమానించాడు. చెల్కలపల్లిలో ఉన్న స్నేహితురాలి తండ్రితో
వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించి గొడవపెట్టుకున్నాడు. ఇరువురి మధ్య పలుమార్లు
వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చెల్కలపల్లికి వెళ్లి ఆ అనుమానిత
వ్యక్తి ఇంటికి నిప్పంటించాడు. స్థానికులు మంటలను అర్పివేసి ఘటనపై పోలీసులకు
ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని
దర్యాప్తు జరుపుతున్నారు.