Advertisement

  • కాబోయే భర్తకి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడేది... ఆ తర్వాత తన నిజస్వరూపం చూపించింది...!

కాబోయే భర్తకి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడేది... ఆ తర్వాత తన నిజస్వరూపం చూపించింది...!

By: Anji Tue, 29 Dec 2020 11:35 AM

కాబోయే భర్తకి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడేది... ఆ తర్వాత తన నిజస్వరూపం చూపించింది...!

కాబోయే భర్తకి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడేది. ఆ తర్వాత యువతి తన నిజస్వరూపం బయటపెట్టింది. ప్రియుడికి ఫోన్ చేసింది.

అప్పటికే ఊరి చివర కాపుకాసి ఉన్న ప్రియుడు తన ప్రియురాలికి కాబోయే భర్తని అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ అమానుష ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే... ఆళ్లగడ్డకి చెందిన యువతి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కళాశాలలో చదువుతున్న యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఆ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసిపోవడంతో తీవ్రంగా మందలించారు.

అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో చేయిదాటిపోతోందని భావించి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కోటకందుకూరు గ్రామానికి చెందిన గఫార్‌బేగ్‌తో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది.

అయితే ప్రేమించిన యువకుడిని కాదని మరొకరితో పెళ్లి నిశ్చయించడం యువతికి నచ్చలేదు. కాబోయే వరుడు గఫార్‌బేగ్‌ని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలసి పక్కా స్కెచ్ వేసింది.

పెళ్లి ఇష్టం లేదనే విషయం బయటికి పొక్కకుండా కాబోయే భర్తకి ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడేది. మూడు రోజలు కిందట గఫార్‌బేగ్‌కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరని.. ఇంటికి రావాలని కోరింది. కాబోయే భార్య ప్రేమగా పిలవడంతో పండ్లు, స్వీట్లు తీసుకుని గఫార్‌బేగ్ ఆమె ఇంటికి వెళ్లాడు.

అక్కడ రెండు గంటలు ఉన్న గఫార్‌బేగ్ ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరాడు. వెంటనే యువతి తన ప్రియుడికి ఫోన్ చేసి సిద్ధంగా ఉండాలని చెప్పడంతో అతను మరో యువకుడిని తీసుకుని కోటకందుకూరు సమీపంలో కాపుకాశాడు.

గఫార్ ఏ దారిలో వెళ్తాడో తెలియక వెనక మరో ఇద్దరు యువకులు అతనికి తెలియకుండా మరో బైక్‌పై వెనుక వెళ్లారు. సరిగ్గా గ్రామ సమీపంలోకి చేరుకోగానే అప్పటికే కాపుకాసి ఉన్న యువతి ప్రియుడు తన స్నేహితుడితో కలసి బైక్‌ ఆపి గఫార్‌ఫై మారణాయుధాలతో దాడి చేశాడు.

ఇంతలో వెనక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కూడా కత్తులతో పొడవడంతో గఫార్‌బేగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

కోటకందుకురు సమీపంలో యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే చీకటి పడడంతో ఒంటిపై గాయాలు కనిపించలేదు.

రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని భావించారు. కానీ సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అనుమానాలు రేగాయి.

స్పాట్‌లో లభించిన మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయం బయటపడింది. కాబోయే భార్య నమ్మకంగా పిలిపించి దారుణంగా హత్య చేయించినట్లు తేలింది.
పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Tags :

Advertisement