Advertisement

  • ఫేస్‌బుక్ ప్రేమ కోసం ఓ అమ్మాయి సాహస౦...ఇండియా వచ్చేసిన బంగ్లాదేశ్ యువతి...ఊహించని షాక్

ఫేస్‌బుక్ ప్రేమ కోసం ఓ అమ్మాయి సాహస౦...ఇండియా వచ్చేసిన బంగ్లాదేశ్ యువతి...ఊహించని షాక్

By: chandrasekar Wed, 25 Nov 2020 5:13 PM

ఫేస్‌బుక్ ప్రేమ కోసం ఓ అమ్మాయి సాహస౦...ఇండియా వచ్చేసిన బంగ్లాదేశ్ యువతి...ఊహించని షాక్


బెంగాల్‌కు చెందిన ఓ యువకుడితో బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ఓ యువతికి ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ కోసం ఆ అమ్మాయి సాహసమే చేసింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వచ్చేసింది. అంతేకాదు రహస్యంగా సరిహద్దులు దాటింది. చివరికి ఆమెకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం అరెస్టై చెన్నై పోలీసుల అదుపులో ఉంది. వివరాలలోకి వెళితే...పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన శశి షేక్‌ (28) అనే యువకుడికి బంగ్లాదేశ్‌కు చెందిన పాపియా ఘోష్‌ (22) అనే యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. పాపియా ఎఫ్‌బీ ఫోటో చూసి ఇంప్రెస్ అయిన శశి షేక్.. ఆమెను పొగుడుతూ కామెంట్స్ పెట్టాడు. అలా ఏర్పడిన పరచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.

ప్రియుడి కోసం పాపియా ఘోష్‌ పాస్‌పోర్టు లేకుండానే బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌‌లోకి ప్రవేశించింది. అనంతరం శశి షేక్ ఆమెను వెంటబెట్టుకొని తమిళనాడులోని తిరుపూర్‌కు వచ్చాడు. గత ఫిబ్రవరిలో పొల్లాచీలో వారిద్దరూ తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలోని మింజూర్‌లో కాపురం పెట్టారు. శశి షేక్ స్థానికంగా కంటెయినర్ యార్డ్‌లో ఉద్యోగం చూసుకున్నాడు. ఇక తమ కుమార్తె కనిపించకుండాపోవడంతో పాపియా తల్లిదండ్రులు బంగ్లాదేశ్‌లో అదృశ్యం కేసు పెట్టారు. అక్కడి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె భారత్‌లో ప్రవేశించినట్లు తెలియడంతో ఆ సమాచారాన్ని భారత అధికారులకు అందించారు. బంగ్లాదేశ్ అధికారులు ఇచ్చిన వివరాలతో దర్యాప్తు చేసిన భారత్‌కు చెందిన క్రైమ్ బ్రాంచ్-క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆ యువతి మింజూరులో ఉన్నట్లు గుర్తించారు. కాంచీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాంచీపురం పోలీసులు పాపియో ఘోష్‌, శశి షేక్ నివాసం ఉంటున్న ఇంటికి చేరుకొని వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకొని స్థానికంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. అయితే.. పాపియా సరైన పత్రాలు, పాస్‌పోర్టు లేకుండానే అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ యువతిని పొన్నేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాపియాను బంగ్లాదేశ్ పంపించాలా? ఇక్కడే ఉంచాలా అనే విషయంపై ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారని తిరువల్లూర్ ఎస్పీ పి అరవిందన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాపియా తన ప్రియుడికి దూరమవుతానేమో అనే ఆందోళనతో ఉంది.

Tags :

Advertisement