45 ఏళ్ళ కింద అత్యవసర పరిస్థితిపై సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిన 94 ఏళ్ళ బామ్మ
By: Sankar Mon, 14 Dec 2020 4:51 PM
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1975 లో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన విషయం తెలిసిందే...అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చి.. ఆమెను పార్లమెంటు సభ్యురాలిగా ఆరేండ్లపాటు నిషేధించింది. దాంతో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఫలితంగా దేశ ప్రజలకు రాజ్యాంగ హక్కులు, పౌర స్వేచ్ఛలు నిలిపివేయబడ్డాయి. మీడియా తీవ్రంగా పరిమితం చేయబడింది. 1977 వరకు కొనసాగిన కాలంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు జైలు పాలయ్యారు.
అత్యవసర పరిస్థితిని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ 94 ఏండ్ల వీర సరీన్ అనే వృద్ధురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమర్జెన్సీ విధించడంతో తన భర్త అకారణంగా, ఏకపక్షంగా నిర్బంధానికి గురయ్యారని, ఫలితంగా దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నది. తమ ఆస్తిని అప్పటి ప్రభుత్వం స్వాధీన పర్చుకున్నదని, తన భర్త తీవ్ర ఒత్తిడికి లోనై అకాల మరణం చెందారని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
"అత్యవసర పరిస్థితి విధించడానికి ముందు.. తన భర్త కరోల్బాగ్, కేజీ మార్గ్ వద్ద బంగారు కళలు, రత్నాలు, కళాఖండాలు మొదలైన వ్యాపారాలను అభివృద్ధి చేశారు. మా స్థిరాస్తిని స్వాధీనం చేసుకున్నారు. కళాఖండాలు, రత్నాలు, తివాచీలు, పెయింటింగ్స్, దంతాలు, విగ్రహాలతోపాటు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు వరకు వాటిని పునరుద్ధరించలేదు" అని పిటిషనర్ తన పిటిషన్లో తెలిపారు.