Advertisement

కరోనా తగ్గిన తర్వాత కూడా వారిలో ఆ లక్షణాలు

By: Sankar Thu, 20 Aug 2020 3:27 PM

కరోనా తగ్గిన తర్వాత కూడా వారిలో ఆ లక్షణాలు


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.. చైనాలో మొదలైన ఈ వైరస్.. ఇటలీ, స్పెయిన్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలను వణికింది. తర్వాత బ్రెజిల్, రష్యా, ఇండియాపై ప్రతాపం చూపుతోంది. యూరప్ దేశాలతో పోలిస్తే.. మన దగ్గర కరోనా మరణాల రేటు తక్కువే, మన దేశంలో రికవరీ రేటు కూడా ఆశాజనకంగానే ఉంది. కానీ కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.

కోవిడ్ కారణంగా హాస్పిటల్ పాలైన వారిలో దాదాపు మూడొంతుల మంది మూడు నెలల తర్వాత కూడా లక్షణాలతో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. 110 మంది పేషెంట్లను పరిశీలించగా.. 81 మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్‌ను జయించిన చాలా రోజుల తర్వాత కూడా ఆయాసం, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి.

లాంగ్ కోవిడ్’ కారణంగా చాలా మంది బట్టలు ఉతకడం లాంటి రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న ఏడుగురిలో ఒకరికి ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడుతున్నాయని చెస్ట్ స్కాన్‌లో తేలుతోందని బ్రిస్టల్‌లోని సౌత్‌మిడ్ హాస్పిటల్ డాక్టర్లు గుర్తించారు. కొంత మంది నిపుణులు కరోనాను ఈ తరం పొలియోగా అభివర్ణిస్తున్నారంటే.. దాని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా తగ్గాక జ్వరం, దగ్గు లాంటివి తగ్గుతున్నాయి. కానీ ఆయాసం, కండరాల నొప్పులు, ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలు మాత్రం 12 వారాలు దాటినా కనిపిస్తున్నాయి. కొంత మంది నిద్రలేమితో సతమతం అవుతున్నారు.

Tags :
|
|

Advertisement