రైతు బ్యాంకు అకౌంట్ లో 473 కోట్లు ...
By: Sankar Fri, 11 Dec 2020 09:59 AM
ఆ వ్యక్తి ఒక సామాన్య రైతు ..కానీ రాత్రికి రాత్రే ఆ రైతు అకౌంట్ లో రూ.473 కోట్ల మేర నగదు జమైంది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు వెళ్లాడు. డబ్బులు అవసరం ఉండగా ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు.
ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అంతే తన ఖాతాలోని బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఖాతాలో రూ.473,13,30,000 అని ఉంది. ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్ ఏమైనా వచ్చిందేమోనని ఎస్బీఐ ఏటీఎంలో కూడా చెక్ చేశాడు. అక్కడా అంతే బ్యాలెన్స్ చూపించింది.బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్ చేసి ‘మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.. ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు. అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది.