రైనా కుటుంబంపై దుండగుల దాడి కేసును ఛేదించిన పోలీసులు
By: Sankar Wed, 16 Sept 2020 4:53 PM
గత నెలలో పంజాబ్లోని పఠాన్కోట్లో క్రికెటర్ సురేష్ రైనా కుటుంబ సభ్యులను హత్య చేసిన ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం చెప్పారు. పంజాబ్ డీజీపీ దింకర్ గుప్తా మాట్లాడుతూ ‘నిందితులు అంతరాష్ట్ర దోపిడీ-నేరస్థుల ముఠాలో భాగం. హత్య చేసిన వారితో పాటు ఆ ముఠాలో మరో 11 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిపారు.
పంజాబ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిన ముఠాలో తాము భాగమని నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దాడికి ఆగష్టు 19 అర్థరాత్రి జరిగిందని అనుమానం రాకుండా ఉండటానికి ఇద్దరు, ముగ్గురు కలిసి వేరు వేరుగా వెళ్లి ఈ ముఠా అశోక్ కుమార్ (రైనా మామ) ఇంటి సమీపంలో కలుసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆరోజు రాత్రి వారు చేయాలనుకున్న మొదటి రెండు దోపిడీ ప్రయత్నాలు విఫలమయ్యాయని కుమార్ ఇల్లు మూడవది అని తెలిపారు.
ఐదుగురు నిందితులు నిచ్చెన ఉపయోగించి గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించారు. రైనా కుటుంబంలోని ముగ్గురు సభ్యులు నేలమీద మాట్స్ మీద నిద్రిస్తున్నట్లు గమనించారు. ఇంటిలోకి ప్రవేశించగానే నిందితులు వారి తలపై కొట్టారు. మిగిలిన వారిపై కూడా దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలతో తప్పించుకున్నారని డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు. వారు తప్పించుకొని రెండు లేదా మూడు గ్రూపులుగా విడిపోయి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అని ఆయన తెలిపారు.
ఈ దాడిలో రైనా మామ ఆశోక్ కుమార్, అతని కజిన్ కౌషల్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అతని అత్త ఆశా రాణి పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దాడి తరువాత రైనా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి, దోషులను పట్టుకోవాలని ముఖ్యమంత్రిని కోరిన సంగతి తెలిసిందే.