తమిళనాడులో విషాదం..అనుమానాస్పద రీతిలో 28 నెమళ్ళు మృతి
By: Sankar Thu, 17 Sept 2020 11:39 AM
తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకేసారి 28 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కొవిల్పట్టి గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట వేశారు. అక్కడ పురుగుల మందు కలిపిన విత్తనాలను నెమళ్లు సేవించడంతో అవి చనిపోయి ఉండొచ్చని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు.
నెమళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు.. నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. నెమళ్లు మొక్కజొన్న విత్తనాలు తినడం వల్లే.. జీర్ణం కాక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
పంటలను పక్షులు, మూగజీవాల నుంచి కాపాడుకునేందుకు విత్తనాల్లో పురుగుల మందు కలిపి రైతులు చల్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.