సింగరేణి లాభాల్లో 28 శాతం బోనస్ కార్మికులకు...సీఎండీ శ్రీధర్ ప్రకటన
By: chandrasekar Wed, 14 Oct 2020 11:40 AM
హైదరాబాద్: సింగరేణి
కార్మికులకు లాభాల్లో 28 శాతం బోనస్ను ఈనెల 23న చెల్లిస్తున్నట్టు
సంస్థ సీఎండీ శ్రీధర్ మంగళవారం ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలు రూ.993.86 కోట్లు కాగా దీనిలో 28శాతం
అంటే రూ.278.28 కోట్లను సంస్థ ఉద్యోగులకు ఈ నెల 23న పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. సగటున ఒక్కో
కార్మికునికి రూ.60,468 చొప్పున లభించనున్నట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో
మార్చిలో మినహాయించుకున్న జీతాన్ని కూడా ఈ లాభాల బోనస్తో కలిపి కార్మికుల బ్యాంకు
ఖాతాల్లో జమచేయనున్నట్టు ప్రకటించారు.
ప్రతి ఏడాది మాదిరిగానే
ఈసారి కూడా దసరా పండుగ అడ్వాన్స్ ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఈ నెల 19న
ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనున్నట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో కంపెనీ ఆర్థిక
పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో
ఉంచుకొని గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 28 శాతం లాభాల బోనస్ను చెల్లించాలని సీఎం కేసీఆర్
ఆదేశించారని, దీనికి సింగరేణి కార్మికుల తరఫున కేసీఆర్కు
కృతజ్ఞతలు తెలుపుతున్నామని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాకముందు 2012-13లో లాభాల వాటా 18 శాతం ఉండగా 2013-14కు సంబంధించి సీఎం కేసీఆర్ 20 శాతానికి పెంచారని తెలిపారు. ఇలా ఏటా లాభాల వాటా
పెరుగుతూ వస్తున్నదన్నారు. గతేడాది 28 శాతం ఇవ్వగా కరోనా ప్రభావంతో సింగరేణి ఆర్థికంగా
కాస్త ఇబ్బంది పడుతున్నా కార్మికులపై అవ్యాజమైన ప్రేమ ఉన్న సీఎం తిరిగి 28 శాతం
లాభాల వాటాను ప్రకటించడంతో సింగరేణివ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు
హర్ష౦ వ్యక్తంచేస్తున్నారు.
2019-20 నికర లాభాలు...రూ.993.86 కోట్లు
ఉద్యోగులకు పంపిణీ
చేసేది...రూ.278.28 కోట్లు
సగటున ఒక్కో
కార్మికునికి...రూ.60,468
దసరా అడ్వాన్స్
ఒక్కొక్కరికి...రూ.25 వేలు