తెలంగాణాలో నెలరోజుల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు ఎన్ని చేసారో తెలుసా !
By: Sankar Wed, 12 Aug 2020 1:58 PM
తెలంగాణలో కరోనా వైరస్ ట్రేసింగ్ జోరుగా సాగుతున్నది. పాజిటివ్ కేసులను నిర్ధారించడంలోనూ తెలంగాణ ముందున్నది. రాష్ట్రంలో గత నెల రోజుల్లో 2.55 లక్షల మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేపట్టారు.
ఆగస్టు 8వ తేదీ వరకు కోవిడ్ నిర్ధారణ కొరకు 5,90,306 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. దాంట్లో రాపిడ్ యాంటీజెన్ టెస్ట్(ఆర్ఏటీ) పద్ధతిలో 2.55 లక్షల మందికి పరీక్షలు చేపట్టారు. ర్యాపిడ్ యాంటీజెన్ పద్ధతిలో పరీక్షలు చేపట్టడం జూలై 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది.
ర్యాపిడ్ పరీక్షలో సుమారు 1536 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయి. వారికి మళ్లీ నెగటివ్ వచ్చింది. లక్షణాలు ఉన్నవారందికీ రెండవసారి రివర్స్ ట్రాన్స్స్క్రిప్షన్ పాలీమిరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నోవెల్ కరోనా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 84,544గా ఉంది. దాంట్లో 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 61,294 మంది రికవరీ అయ్యారు. 654 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.