Advertisement

రూ.25 లక్షలు స్కాలర్‌ షిప్‌ స్వాహా

By: Dimple Sat, 12 Sept 2020 09:11 AM

రూ.25 లక్షలు స్కాలర్‌ షిప్‌ స్వాహా

ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్‌ ఫీజులను కొట్టేసిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వెలుగుచూసింది. ఈ మొత్తాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు మళ్లించుకుని స్వాహాచేసినట్టు తేలింది. ఉరవకొండ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్‌ ఫీజుల కింద మొత్తం రూ.25 లక్షలు ఈ ఏడాది మేలో మంజూరయ్యాయి. స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు, ట్యూషన్‌ ఫీజులు ప్రభుత్వ బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది.

దీనిని అదునుగా తీసుకుని కాలేజీ సీనియర్ అసిస్టెంట్ ఆ మొత్తాన్ని కాజేశాడు. సంబంధిత ఖాతాలకు జమ చేస్తానంటూ అధికారులను నమ్మించి, నకిలీ చలానాల ద్వారా ఆ రూ.25 లక్షలను తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన అధికారులు విచారించగా.. తొలుత రూ.13 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. తరువాత మరింత మొత్తం కొట్టేసినట్టు మరో ఉద్యోగి అనుమానం వ్యక్తం చేయడంతో అధికారులు మరోసారి పరిశీలన చేశారు. దీంతో మరో రూ.12 లక్షలు కూడా దారి మళ్లించినట్లు నిర్ధారణ అయ్యింది.

మొత్తం రూ.25 లక్షలను ఆ ఉద్యోగి కాజేసినట్లు స్పష్టమైంది. నిందితుడి వ్యక్తిగత ఖాతా ఉన్న అనంతపురం బ్యాంకులో విచారించగా రూ.25 లక్షలు డ్రా చేసుకున్నట్లు కాలేజీ అధికారుల విచారణలో తేలింది. అక్కడ ప్రస్తుతం ఆయన వ్యక్తిగత ఖాతాలో రూ.200 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. రూ.25 లక్షలు కాజేసినట్టు అధికారులకు అనుమానం రాకుండా ప్రధాన బ్యాంకుకు సంబంధించిన నకిలీ చలానాలు సృష్టించాడు.

బ్యాంకుకు సంబంధించి సీళ్లు నకిలీవి తయారుచేయించి, వాటితో నకిలీ చలానాలపై ముద్ర వేసి, బ్యాంకు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. గతంలో బ్యాంకులో పని చేసిన అధికారి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలిసింది. ఈ నకిలీ చలానాల కారణంగా అధికారులు స్వాహా బాగోతాన్ని గుర్తించడం ఆలస్యమైంది.

Tags :
|

Advertisement