ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 16 మంది సిబ్బందికి కరోనా వైరస్
By: chandrasekar Wed, 01 July 2020 7:28 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో
పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రధాన
న్యాయమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు బుధవారం
హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. హైకోర్టు
పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు
జారీచేశారు. అయితే అత్యవసర పిటిషన్లను ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీలో కరోనా వైరస్
తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం ఏపీలో మరో 704 మందికి కొత్తగా వైరస్
నిర్దారణ కాగా మరో ఏడుగురు కరోనాతో
మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14,595కి చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాలు 187కి చేరాయి.
సోమవారం ఉదయం 9 గంటల
నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 704 కేసులు నిర్ధారణ కాగా వీరిలో ఏపికి చెందినవారు 648 మంది, ఇతర
రాష్ట్రాల నుంచి వచ్చినవారు 51 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఐదుగురు ఉన్నారు.
గడిచిన 24
గంటల్లో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో
ఇద్దరు, అనంతపురం, నెల్లూరు
జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల్లో అత్యధికంగా
అనంతపురం, చిత్తూరు
జిల్లాల్లో 100కిపైగా నమోదయ్యాయి. గడచిన 24
గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,114 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటి వరకూ కరోనా నుంచి 6,161 మంది
కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులు, 1,736 కోవిడ్ సెంటర్లలో ఇంకా 7,897 మంది చికిత్స పొందుతున్నారు.