డబ్బుల పంపిణీ అడ్డుకున్నందుకు పోలీసులు దాడి చేశారు: బండి సంజయ్
By: chandrasekar Mon, 30 Nov 2020 5:54 PM
బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న
రాత్రి మేడ్చల్లో డబ్బులు పంచుతుంటే మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీష్
రెడ్డి అడ్డుకు౦టే పోలీసులు ఆయన పైనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దాడిలో
గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరీష్ రెడ్డిని బండి సంజయ్ అర్థరాత్రి 12
గంటలకు పరామర్శించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో పనిచేస్తూ రాష్ట్ర డీజీపీ టీఆర్ఎస్
పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాభిమానం కోల్పోయిన TRS పార్టీ
అడ్డదారిలో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. పోలీస్ అధికారులే దగ్గరుండి డబ్బుల
పంపిణీ చెయ్యడం సిగ్గుచేటన్న బండి సంజయ్ ఇలాంటి వాటిని బీజేపీ కార్యకర్తలు
ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కోరారు. ఉన్నత స్థాయి నిఘా అధికారి TRS పార్టీని
ఎలా గెలిపించాలా అని వ్యూహ రచన చేస్తూ చట్టాల్ని తుంగలో తొక్కారని బండి సంజయ్ ఫైర్
అయ్యారు. అభివృద్ధే గెలిపిస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్షించి తీరా ఎన్నికలు
దగ్గర పడ్డాక నోట్ల కట్టలతో బయల్దేరారని టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం
పోలీసులను TRS కార్యకర్తలుగా వాడుకుంటూ రాజ్యాంగ విలువలను తుంగలో
తొక్కుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్న
సంజయ్ TRS నాయకులు రెడ్ హ్యాండెడ్గా
డబ్బులు పంచుతూ పట్టుబడినా కేసులు నమోదు చెయ్యకపోవడం దారుణమన్నారు. ఎన్నికల
అధికారులు రేపటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉదయం 7 గంటల
నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఈసారి EVM పద్ధతిలో
కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరపనున్నారు. ఎన్నికల సిబ్బంది డిసెంబర్ 1న ఉదయం
5.30కి
సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్ధసారధి
ఆదేశించారు. ఉదయం 6 గంటలలోగా పోలింగ్ ఏజెంట్లు సిద్ధంగా ఉండాలన్నారు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 150
డివిజన్లకు 1,122 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.