చైనాపై సై అంటే సై అంటోన్న భారత్... చైనా యుద్ధ నౌకలను మోహరించిన భారత్
By: chandrasekar Mon, 31 Aug 2020 5:59 PM
జూన్ 15న లఢక్లోని గాల్వాన్ లోయ వద్ద చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20
మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. నాటి నుంచి దేశ రక్షణ విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా పెత్తనం చెలాయిస్తున్న దక్షిణ చైనా సముద్ర జలాలకు భారత్ యుద్ధ నౌక వెళ్లింది. గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి చైనా సైనిక కార్యకలాపాలపై నిఘా ఉంచింది. సమీపంలోని అమెరికా యుద్ధ నౌకలతో సంప్రదింపులు జరిపి సమాచారాన్ని పంచుకుంటున్నది.
చైనా, భారత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య పలు విడతలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సమావేశంలో దక్షిణ చైనా సముద్రంలో భారత్ యుద్ధ నౌక మోహరింపుపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతున్నదని తెలిపింది.
మరోవైపు హిందూ మహా సముద్రంలో యుద్ధ నౌకలను భారత్ భారీగా మోహరించింది. చైనా రవాణా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని మలక్కా స్ట్రెయిట్స్పై పూర్తి నిఘాను పెట్టింది. చైనా నేవీ కదలికలపై భారత యుద్ధ నౌకలు కన్నేసి ఉంచాయి. ఇండియన్ నేవీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నయని రక్షణ వర్గాలు తెలిపాయి.