భారత్తో పాటు మరికొన్ని దేశాలపై వీసా నిషేధాన్ని విధించిన చైనా
By: chandrasekar Fri, 06 Nov 2020 3:46 PM
కరోనా వైరస్ మహమ్మారి
నేపథ్యంలో చైనా తాజాగా కొత్త ఆంక్షలను
విధించింది. భారత్తో పాటు మరికొన్ని దేశాలపై వీసా నిషేధాన్ని చైనా విధించింది.
వీసా ఉన్నవారికి కూడా తాత్కాలికంగా ఎంట్రీని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలో ఉన్న
చైనా ఎంబసీ ప్రకటించింది. అయితే చైనా విధించిన నిషేధం కేవలం భారత్కు మాత్రమే
కాదు అని, ఇతర
ప్రపంచదేశాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 3వ తేదీ
తర్వాత వీసాలు జారీ అయినవారికి ఈ ఆంక్షలు వర్తించవు. బ్రిటన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, బెల్జియం, పిలిప్పీన్స్
దేశాల నుంచి వస్తున్న వారిపైన కూడా చైనా తాత్కాలిక నిషేధం విధించింది.
తాత్కాలిక నిషేధానికి
సంబంధించి చైనా ఎంబసీ తన నోట్లో ఈ విషయాన్ని తెలిపింది. అయితే దౌత్యపరమైన, సేవాపరమైన, సీ
వీసాలు ఉన్నవారికి ఈ నిషేధం వర్తించదు అని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొన్నది.
అత్యవసరం ఉన్నవారు, మానవతా సాయం చేసేవారు చైనా ఎంబసీలో దరఖాస్తు
చేసుకోవచ్చు అని ఎంబసీ పేర్కొంది. కరోనా పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలు
ఉంటాయని చైనా ప్రకటించింది.