కరోనా వైరస్ మహమ్మారి రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది - బిల్గేట్
By: Anji Mon, 14 Dec 2020 3:50 PM
ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రమవుతుందా? అంటే అవునంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్.
సీఎన్ఎస్ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల్లో కోవిడ్ మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని బిల్గేట్ సూచించారు.
అయితే, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే వైరస్ ముప్పును అరికట్టవచ్చని అన్నారు. ‘విచారకరమైన విషయమేంటంటే.. వచ్చే 4-6 నెలల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనాల ప్రకారం మరో 2 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది... అయితే మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ఈ మరణాల శాతాన్ని తగ్గించవచ్చు’ అని అన్నారు.
‘కరోనా వైరస్ను అమెరికా మరింత సమర్ధవంతంగా కట్టడిచేస్తుందని భావిస్తున్నాను.. ఇటువంటి మహమ్మారి గురించి 2015లోనే నేను హెచ్చరించాను. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను.
అయితే అమెరికా సహా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్ ప్రభావం నేను ఐదేళ్ల కిందట అంచనా వేసినదానికంటే తక్కువగానే ఉండటం ఆశ్చర్యకరం’ అని బిల్గేట్స్ వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
నిర్ధారణ, చికిత్స, వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవిజ్ఞానం ఎలా ఉందో మనకు తెలుసు.. వీటన్నింటి అత్యవసరంగా ఒకే చోటికి చేర్చాలి... కాబట్టి మహమ్మారి విషయంలో మన నైపుణ్యం సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు.