Advertisement

  • కెప్టెన్‌గా కోహ్లీ సాధించింది ఏమి లేదు ..గౌతమ్ గంభీర్

కెప్టెన్‌గా కోహ్లీ సాధించింది ఏమి లేదు ..గౌతమ్ గంభీర్

By: Sankar Mon, 15 June 2020 7:52 PM

కెప్టెన్‌గా కోహ్లీ సాధించింది ఏమి లేదు ..గౌతమ్ గంభీర్


టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. 2017లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి పూర్తి స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కి చేరిన టీమిండియా.. అక్కడ పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది. దాంతో.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సాధించింది ఏమీ లేదని తేలిపోయినట్లు గంభీర్ ఎద్దేవా చేశాడు.

బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీకి తిరుగులేదు. కానీ.. కెప్టెన్‌గా మాత్రం ఐసీసీ టోర్నీల్లో జట్టుని విజేతగా నిలపలేకపోతున్నాడు. ‘‘క్రికెట్‌ అనేది టీమ్‌ స్పోర్ట్. వ్యక్తిగతంగా ఎన్ని పరుగులైనా చేయచ్చు. కానీ.. కెప్టెన్‌గా విజయాల మాటేమిటి..? బ్రయాన్ లారా, జాక్వెస్ కలిస్ తాము క్రికెట్ ఆడే రోజుల్లో పరుగుల వరద పారించారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఆ తరహాలో పరుగులు రాబడుతున్నాడు. కానీ.. ఐసీసీ ట్రోఫీలు గెలవకపోతే సదరు ఆటగాడి కెరీర్ అసంపూర్తిగా ఉండిపోతుంది. నిజాయతీగా చెప్పాలంటే కెప్టెన్‌గా ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎన్నో సాధించొచ్చు’’ అని గంభీర్ వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ కంటే ముందు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్రసింగ్ ధోనీ.. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని ధోనీ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలపగా.. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు విజేతగా నిలిచింది. కానీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.

Tags :
|
|

Advertisement