అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్న టాప్ హీరో, హీరోయిన్
By: chandrasekar Tue, 04 Aug 2020 12:56 PM
ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి
కాలం నుంచే వెండితెరపై హీరో హీరోయిన్లుగా నటించిన ఎంతో మంది ప్రముఖ నటీనటులు
అన్నాచెల్లెళ్లుగా, అక్కాతమ్ముళ్లుగా నటించారు. అయితే, ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు ఎవరూ ఓ హీరోకి
చెల్లెలుగానో, అక్కగానో నటించడం చూడలేదు. కానీ, ఇప్పుడు
చూడబోతున్నాం. హీరో మంచు విష్ణుకు చెల్లెలిగా కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ‘మోసగాళ్ళు’
చిత్ర యూనిట్ ప్రకటించింది. హాలీవుడ్-ఇండియన్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోన్న
‘మోసగాళ్ళు’ చిత్రంలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ
సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో విష్ణు, కాజల్
తోబుట్టువులుగా నటిస్తున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటిదాకా మనం చూడని
ఆన్స్క్రీన్ అన్నాచెల్లెళ్ల జంటగా వాళ్లు అలరించనున్నారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా
ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించేవాళ్లు
తోబుట్టువులుగా చేయడం చాలా అరుదు. ‘రక్త సంబంధం’లో ఎన్టీఆర్, సావిత్రి
అన్నాచెల్లెళ్లుగా, ‘కృష్ణార్జునులు’లో శోభన్బాబు, శ్రీదేవి
అన్నాచెల్లెళ్లుగా నటించగా బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్
అన్నాచెల్లెళ్లుగా కనిపించారు. ఇప్పుడు ‘మోసగాళ్ళ’లో విష్ణు, కాజల్లను
తోబుట్టువులుగా చూడబోతున్నాం. మంచి కమిట్మెంట్తో తను చేసే క్యారెక్టర్లకు
ప్రాణం పోస్తుందని పేరు పొందిన కాజల్ అగర్వాల్ ‘మోసగాళ్ళు’ సినిమా కోసం ఒక
స్పెషల్ వర్క్షాప్కు హాజరయ్యారు.
చరిత్రలో నమోదైన
అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తయారవుతున్న ‘మోసగాళ్ళు’ మూవీకి సంబంధించి
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ యాక్టర్
సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. లాస్ ఏంజెల్స్కు
చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ‘మోసగాళ్ళు’ సినిమాకు హాలీవుడ్
సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పనిచేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై విష్ణు మంచు
నిర్మిస్తుండగా, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
వాస్తవానికి ఈ వేసవిలోనే ‘మోసగాళ్ళు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా
మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్తో విడుదల తేదీ వాయిదాపడింది.