Advertisement

  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శృతిహాసన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శృతిహాసన్

By: chandrasekar Thu, 13 Aug 2020 04:33 AM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శృతిహాసన్


గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శృతిహాసన్ నామినేట్ చేసినందుకు మహేష్ బాబు, దేవిశ్రీ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు రోజుల క్రితం తన 45వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు నాడు ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. తన అభిమానులంతా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని అయన కోరారు. అలాగే, ఈ ఛాలెంజ్‌కు తమిళ స్టార్ హీరో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోయిన్ శృతిహాసన్‌ను నామినేట్ చేశారు. ఇప్పటికే విజయ్ ఈ ఛాలెంజ్ ను అంగీకరించి అందులో పాల్గొని మొక్కలు నాటిన ఫొటోలతో ట్వీట్ చేశారు. ఇప్పుడు శృతిహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిజానికి మహేష్ బాబు కన్నా ముందే శృతిహాసన్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. అందుకే, తనను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసినందుకుగాను మహేష్ బాబుతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌కు శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతోన్న ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఛాలెంజ్‌ను తాను బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు విసురుతున్నట్టు శృతిహాసన్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం ద్వారా దేశానికీ ఎంతో మేలు చేసినట్లు అవుతుంది.

శృతిహాసన్ ట్వీట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు శృతిహాసన్‌ను అభినందించారు. ఈ మంచి పని మరింత ముందుకు వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించడంలో మిగిలింది ఇక ఎన్టీఆర్ మాత్రమే. ఆయన కూడా త్వరలోనే మొక్కలు నాటి ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేయొచ్చు. దీని కోసం ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సినీ పరిశ్రమల్లోని స్టార్ల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తోంది.

Tags :
|
|

Advertisement