మహేష్ బాబు కొత్త సినిమా మోషన్ పోస్టర్ విడుదల ..
By: Sankar Sun, 09 Aug 2020 4:14 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు 45వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా 'సర్కారు వారి పాట' చిత్రబృందం ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు మ్యూజికల్ సర్ప్రైజ్ ఇచ్చింది. సర్కారు వారి పాట అంటూ సాగుతూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సంగీతం అదిరిపోయింది.
ప్రీలుక్లో స్టైలిష్గా మెడ మీద రూపాయి నాణెం టాటూతో కనిపించిన మహేశ్ ఈ సారి రూపాయి బిళ్ళను ఎగరేస్తూ మ్యాజిక్ చేశారు. దీంతో బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ మహేశ్ పూర్తి లుక్ మాత్రం చూపించనేలేదు..
హీరో బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు ట్విటర్లో హల్చల్ చేస్తున్నారు . ఇక ఈపాటికే సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను, మహేశ్ ప్రీలుక్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ సందేశాన్ని ఇవ్వనుంది. 'గీతా గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు