సుశాంత్ మృతి కేసులో ఈడీ కార్యాలయానికి హాజరు అయిన రియా చక్రవర్తి
By: Sankar Fri, 07 Aug 2020 1:17 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్తో సహజీవనం చేసినట్లు పేర్కొన్న నటి రియా చక్రవర్తి శుక్రవారం ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి(ఈడీ) వచ్చారు. సుశాంత్ మరణం కేసు నేపథ్యంలో అతడి బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది.
కాగా రియా చక్రవర్తి శుక్రవారం ఉదయం ఈడీ సమన్లపై స్పందించారు. సుశాంత్ కేసు విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫెడరలిజానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నదని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు సీబీఐ ఓపికతో ఉండాలని ఆమె సూచించారు.
అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈడీ కూడా తన స్టేట్మెంట్ రికార్డును వాయిదా వేయాలని రియా చక్రవర్తి కోరారు. అయితే ఆమె అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. దీంతో రియా చక్రవర్తి చివరకు ముంబైలోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. సుశాంత్ ఖాతాలో కోట్ల రూపాయలు మాయమయ్యానని, తమ కుమారుడి మరణానికి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు కారణమని సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.