ఇన్స్టాగ్రామ్లో నిర్వహించిన లైవ్లో రేణు దేశాయ్
By: chandrasekar Mon, 20 July 2020 1:02 PM
రేణు దేశాయ్ తన ఇద్దరు
పిల్లలను చూసుకుంటూ లైఫ్ను జాలీగా గడుపుతున్నారు. వాళ్ల ఆలనాపాలనా
చూసుకుంటున్నారు. అయితే, సింగిల్ మదర్గా ఉండటం ఎంత కష్టమో ఆమె తాజాగా
వెల్లడించారు. ‘సింగిల్ మదర్గా ఉండటం చాలా కష్టం. సింగిల్ మదర్ మాత్రమే కాదు
సింగిల్ ఫాదర్స్కు కూడా ఇది వర్తిస్తుంది. మనం పనిచేస్తూ పిల్లల్ని చూసుకోవాలి.
అమ్మనాన్న మనల్ని కని, పెంచి, చదివించి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తారు. మనకు
ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది. ఆ తోడు లేకపోవడం వల్ల నేనొక అసంపూర్ణమైన వ్యక్తిని
అయిపోను. భర్త ఒక తోడు మాత్రమే.
ఈ మరాఠీ అమ్మాయి ‘బద్రి’
సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడి ఆయన్ని వివాహం
చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలు జన్మించిన తరవాత వీరిద్దరూ విడిపోయారు.
ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో రేణు దేశాయ్ వేరుగా ఉంటున్నారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో
నిర్వహించిన లైవ్లో ఈ విషయంపై మాట్లాడారు. తాను సింగిల్ పేరెంట్గా ఉన్నాననే
దిగులు ఎప్పుడూ పడలేదని, కష్టాన్ని ఇష్టంగా భావించి తన పిల్లలతో జీవితాన్ని
ఎంజాయ్ చేస్తున్నానని రేణు చెప్పుకొచ్చారు.
సింగిల్ మదర్గా ఉండటం
చాలా కష్టమని భావించినప్పుడే ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయగలమని, జీవితంలో
ముందుకు వెళ్లగలమని సింగిల్ మదర్స్ అందరికీ రేణు సూచించారు. 2011 నుంచి
తాను సింగిల్ మదర్గా ఉన్నానని అయితే, విడిపోయిన తరవాత ఒక్క ఏడాదిలోనే తాను తేరుకుని తన
పిల్లల గురించి ఆలోచించడం మొదలుపెట్టానని రేణు తెలిపారు. తన పిల్లల గురించి ఏ
నిర్ణయమైనా తానే తీసుకుంటున్నాననే ఆనందం వెలకట్టలేనిదన్నారు. అకీరాకు ఇప్పుడు 16 ఏళ్లు
అని అనుకున్నప్పుడు తనకు చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పారు.
తాను మోడలింగ్లోకి
అడుగుపెట్టిన తరవాత మొదటిసారి పాండ్స్ కోల్డ్ క్రీమ్ యాడ్ చేశానని రేణు దేశాయ్ చెప్పారు.
కథలు చెప్పాలని, డైరెక్ట్ చేయాలనే ఫీలింగ్ కలిగిందన్నారు. ఆ కోరికతోనే
ఇప్పుడు డైరెక్టర్ కాగలిగానని తెలిపారు. నిజానికి తాను కావాలని మోడలింగ్లో
అడుగుపెట్టలేదని చాలా బాగా చదివేదానిని అని డాక్టర్ అవుదామని అనుకున్నానని రేణు
వెల్లడించారు. తన పెద్దమ్మ కొడుకు అడ్వర్టైజింగ్ రంగంలో ఉండేవారని ఆయన రిక్వెస్ట్
చేయడంతో ఒక ఫొటోషూట్ చేశానని అన్నారు. ఆ ఫొటోషూట్ బయటికి రాకుండానే వాటిని ల్యాబ్లో
చూసిన పాండ్స్ కంపెనీ వాళ్లు ఆడిషన్ లేకుండా ఫోన్ కాల్లో తనతో ఒప్పందం
చేసుకున్నారని చెప్పారు.
‘బద్రి’ సినిమాకి సైతం తనను ఆడిషన్ చేయకుండానే
తీసుకున్నారని రేణు దేశాయ్ చెప్పారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎక్కడో తన ఫొటో చూసి
సినిమాలోకి తీసుకున్నారని అన్నారు. పూరి సినిమాలో మరోసారి అవకాశం కచ్చితంగా
చేస్తానన్నారు. ఇండస్ట్రీలోని మంచి దర్శకుల్లో ఆయన ఒకరన్నారు. చాలా శాంతంగా
ఉంటారని, తనకు
తొలి సినిమానే అయినా ఆయన సెట్స్లో ఎప్పుడూ తిట్టలేదని చెప్పారు. పూరి గారితో
పనిచేయడానికి తాను ఎప్పుడైనా సిద్ధమే అన్నారు.
త్వరలోనే తెలుగు
ప్రేక్షకులకు వెండితెరపై కనిపిస్తానని అన్నారు రేణు దేశాయ్. ‘‘ఒక నటిగా మళ్లీ
తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఇది నాకొక పర్ఫెక్ట్ రోల్. ఇద్దరు పిల్లల
తల్లిగా నటిస్తున్నాను. నా వయసుకు తగిన పాత్ర’’ అని రేణు దేశాయ్ వెల్లడించారు.
అయితే, ఆ
సినిమా వివరాలను మాత్రం చెప్పలేదు. లాక్డౌన్ కారణంగా తాను ఐదు నెలలుగా హైదరాబాద్లోనే
ఉండిపోయానని పుణే వెళ్లకపోవడం వల్ల చాలా దిగులుగా ఉందని రేణు అన్నారు