మూడు నెలల తర్వాత ఇంటికి చేరుకున్న మంచు విష్ణు భార్య ..
By: Sankar Thu, 11 June 2020 4:54 PM
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా అనేకమంది ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు సైతం తమ కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. దాదాపు వంద రోజుల తర్వాత లాక్డౌన్ సడలింపులు ప్రకటించడంతో ఎంతోమంది సొంత ఇంటికి ప్రయాణబాట పడుతున్నారు.
ఈ క్రమంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని భారత్కు తిరిగి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేక విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. దీనిద్వారా ఇప్పటికే జోర్డాన్లో చిక్కుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళకు తిరిగి వచ్చారు.
తాజాగా వందే భారత్ మిషన్లో భాగంగా టాలీవుడ్ నటుడు మంచు విష్ణు భార్య విరానికా, అతని పిల్లలు గురువారం సింగపూర్ నుంచి ఇండియాకు చేరుకుంటున్నారు. ఈ విషయాన్ని విష్ణు భార్య విరానికా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇందుకు విమానంలో మాస్కులు ధరించి కూతుళ్లతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘వంద రోజుల తర్వాత సింగపూర్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి చేరుకోవడానికి సహకరించిన వందేభారత్ మిషన్, ఎయిర్ ఇండియా, సింగపూర్ బృందానికి కృతజ్ఞతలు’. అంటూ ట్వీట్ చేశారు. కాగా విరానికా తన పిల్లలతో కలిసి కొంతకాలం క్రితం సింగపూర్ వెళ్లారు. వారు వెళ్లిన అనంతరం లాక్డౌన్ అమలు కావడంతో ఇన్ని రోజులు సింగపూర్లోనే ఇరుక్కుపోయారు.