గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ ..
By: Sankar Wed, 05 Aug 2020 7:14 PM
కరోనాకి భయపడి టాలీవుడ్ సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు షూటింగ్లు మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కరోనా మహమ్మారి వారిని వణికిస్తుంది.
ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన పలువురు నటులు, సింగర్స్, దర్శకులు కరోనా బారిన పడగా తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని అన్నారు. ప్రస్తుతం తాను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. మీ అందరి ఆశీస్సులతో అతి త్వరలోనే కోలుకుంటున్నాని పేర్కొన్నారు. ఈ సమయంలో విశ్రాంతి అవసరమని డాక్టర్స్ సూచించారు. దయచేసి ఎవరు కాల్స్ చేయవద్దు అంటూ బాలు వీడియోలో పేర్కొన్నారు.