అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ కొత్త సినిమా
By: Sankar Mon, 08 June 2020 11:37 AM
లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం థియేటర్స్ బంద్ అవ్వడంతో నిర్మాతలు సినిమాలను డిజిటల్ ఫార్మటు లో డైరెక్ట్ టీవీ లో వచ్చే విధంగా రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు..తొలుత చిన్న చిన్న సినిమాల నిర్మాతలు , డైరెక్టర్లు ఇలా చేసినప్పటికీ ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ టీవీ లోనే రిలీజ్ అయ్యేలా ఉన్నాయి ..తాజాగా స్టార్ హీరోయిన్ , జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు..
థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘పెంగ్విన్’.. జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ను జూన్ 8న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందించారు. మలయాళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు టీజర్లను ఒకేసారి విడుదల చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్లు తాప్సీ పన్ను, సమంత, మంజు వారియర్, త్రిష ‘పెంగ్విన్’ టీజర్ని జూన్ 8న తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. సమంత తెలుగు టీజర్ను, త్రిష తమిళ టీజర్ను, మంజు వారియర్ మలయాళ టీజర్ను లాంచ్ చేయనున్నారు. వీటన్నిటినీ తాప్సీ కూడా ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తారు.
కాగా, ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ వేసవికి ‘పెంగ్విన్’ విడుదల కావాల్సి ఉంది. కానీ, లాక్డౌన్ కారణంగా కుదరలేదు. అందుకే, ఇప్పుడు నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసేస్తున్నారు.