దర్శకుడిగా మారిన జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ
By: Sankar Sun, 23 Aug 2020 7:41 PM
జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్, స్క్రిప్ట్ రైటర్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్పీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది.
ఈ సినిమాలో ప్రధాన పాత్రను జేడీ చక్రవర్తి పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు అతిథిగా విచ్చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబుతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను.
నా మీద నమ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్పై తొలి చిత్రమిది. నా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించడానికి అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.