కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి ..హీరో నాని పిలుపు
By: Sankar Tue, 04 Aug 2020 11:36 AM
కోవిడ్–19 నుంచి పూర్తిగా కోలుకున్న వారంతా ప్లాస్మా దానం చేయాలని సినీ హీరో నాని పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ సజ్జనార్ ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్లాస్మా దానం స్వీకరించేందుకు ప్రముఖుల ద్వారా పిలుపు ఇప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సినీహీరో నాని కోవిడ్ నుంచి కోలుకున్న వారికి పిలుపునిచ్చారు. ఇప్పటికే లక్షలాది మందికి కోవిడ్ వచ్చింది, వీరిలో చాలా మందికి తగ్గిపోయిందని, కోలుకున్నవారంతా ప్లాస్మాదానం చేయాలని కోరారు.
కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తి ఇచ్చే 500 ఎంఎల్ ప్లాస్మా ద్వారా ఇద్దరు కోవిడ్ బాధితులు కోలుకోవడానికి అవకాశం కల్పించినవారవుతారన్నారు. కోవిడ్ బారినపడ్డ వారు కోలుకునేలా చేసేందుకు సైబరాబాద్ కమిషనరేట్ వారు చేపట్టిన కార్యక్రమానికి అందరూ తమవంతు చేయూతనందించాలన్నారు. ప్లాస్మా దానం ద్వారా ఇద్దరి ప్రాణాలు కాపాడితే వచ్చే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్, శాటిస్ఫ్యాక్షన్ కలుగుతుందన్నారు. అందరూ ముందుకొచ్చి 9490617440 ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు.