Advertisement

  • తమిళ సినిమాలో ‘తల’గా అవతరించారు హీరో అజిత్: యువనటుడు కార్తికేయ

తమిళ సినిమాలో ‘తల’గా అవతరించారు హీరో అజిత్: యువనటుడు కార్తికేయ

By: chandrasekar Tue, 04 Aug 2020 6:35 PM

తమిళ సినిమాలో ‘తల’గా అవతరించారు హీరో అజిత్: యువనటుడు కార్తికేయ


తమిళ స్టార్ హీరో అజిత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ సోషల్ మీడియా ద్వారా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనపై తనకున్న ప్రేమను కార్తికేయ చాటుకున్నారు. అజిత్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ట్వీట్ చేశారు.

‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి ఎన్నో ఇబ్బందులు, మరెన్నో వైఫల్యాలు ఎదుర్కొని, ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటూ దృఢంగా మారి తమిళ సినిమాలో ‘తల’గా అవతరించారు. మీ ప్రయాణంలో ప్రతి పేజీని ఒక స్ఫూర్తిగా తీసుకుంటాం సార్. 28 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందనలు’’ అని కార్తికేయ ట్వీట్ చేశారు.

అజిత్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే ఆయన హీరోగా తెలుగు ప్రేక్షకులకే ముందుగా పరిచయం అయ్యారు. గొల్లపూడి మారుతీరావు దర్శకత్వం వహించిన ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో అజిత్ హీరోగా ఎంట్రీ అయ్యారు. అయితే, ఆ తరువాత ఆయన తమిళ ఇండస్ట్రీకి పరిమితం అయిపోయారు.

55కు పైగా తమిళ సినిమాల్లో నటించిన అజిత్‌కు కోలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ తమిళ చిత్రాలు కొన్ని తెలుగులోకి అనువాదమై విడుదలయ్యాయి. ఈ మధ్య కాలంలో ‘వివేకం’, ‘విశ్వాసం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అజిత్ పలకరించారు.

అజిత్‌కు కార్తికేయ అభినందనలు తెలపడం వెనుక కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు మరో కారణం కూడా ఉంది. అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమాయి’ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించనున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఇటీవల RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఈ విషయాన్ని రివీల్ చేసేశారు.

కార్తికేయ ఇప్పటికే నాని ‘గ్యాంగ్ లీడర్’లో విలన్‌గా నటించారు. ఇప్పుడు అజిత్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. కేవలం హీరో పాత్రలకు పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకుంటున్నాడు.

Tags :

Advertisement