- హోమ్›
- వినోదం›
- సుశాంత్ ఆత్మహత్య కేసు: యూట్యూబర్పై రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్...!
సుశాంత్ ఆత్మహత్య కేసు: యూట్యూబర్పై రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్...!
By: Anji Thu, 19 Nov 2020 3:12 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో తనపై తప్పుడు ప్రచారాలు సృష్టించిన బీహార్కు చెందిన రషీద్ సిద్దిఖీ అనే యూట్యూబర్పై యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
ఇదే కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే పేర్లను కూడా లాగినందుకు గానూ సదరు యూట్యూబర్ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. సిద్దిఖీ తన యూట్యూబ్ ఛానల్ ఎఫ్ఎఫ్ న్యూస్ వీడియోలలో రియా చక్రవర్తి కెనడా పారిపోవడానికి అక్షయ్ కుమార్ సహాయపడటమే కాకుండా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఆదిత్య థాక్రేలతో ఎస్ఎస్ఆర్ మరణంపై రహస్య చర్చలు జరిపినట్లు ఆరోపించాడు.
అలాగే సుశాంత్ ‘ఎం.ఎస్.ధోని’ సినిమా అవకాశం పొందటంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపాడు. ఇలా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఫేక్ న్యూస్లు సృష్టించడం ద్వారా రషీద్ సిద్దిఖీ నాలుగు నెలల్లో సుమారు రూ. 15 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది.
గతంలో ఈ యూట్యూబర్పై శివసేన లీగ్ సెల్లోని ధర్మేంద్ర మిశ్రా అనే లాయర్ కేసు నమోదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనితో అసలు గుట్టంతా బయటికొచ్చింది. తన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ను పెంచుకునేందుకు రషీద్ సిద్దిఖీ సుశాంత్ ఆత్మహత్య కేసును ఉపయోగించుకున్నాడు.
తప్పుడు వార్తలు సృష్టిస్తూ గత కొన్ని నెలల్లో లక్ష నుంచి 3.70 లక్షలపైగా సబ్స్క్రైబర్స్ను పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తన వీడియోల ద్వారా మే నెలలో సిద్దిఖీ రూ. 296 సంపాదిస్తే.. సెప్టెంబర్ ఆ సంపాదన కాస్తా రూ. 6 .50 లక్షలకు చేరింది. కాగా, ఈ అంశంపై రషీద్ సిద్దిఖీకి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి.. దర్యాప్తులో పోలీసులకు సహకరించమని కోరింది.