- హోమ్›
- వినోదం›
- బాలీవుడ్ లో కావాలనే ఒక ముఠా నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు ..ఏ ఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో కావాలనే ఒక ముఠా నా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు ..ఏ ఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు
By: Sankar Sat, 25 July 2020 7:03 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో నెపోటిజంపై పెద్ద దుమారమే రేగింది. దీంతోపాటు సంగీత పరిశ్రమ మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి ప్రముఖ గాయకులు కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనక ఒక గ్యాంగ్ ఉందని పేర్కొన్నారు. తన నుంచి చాలా పనిని ఆశిస్తోంటే..దానికి ఒక ముఠా అడ్డుపడుతోందని ఆరోపించారు.
రేడియో మిర్చి ఆర్జే సురేన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్నిఎందుకు కంపోజ్ చేయలేదని అడిగినపుడు పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.
సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ, సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెహమాన్ను సంప్రదించవద్దని సలహా ఇచ్చారంటూ దిల్ బెచారా దర్శకుడు ముఖేష్ ఛబ్రా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెహమాన్ దగ్గరికి వెళ్లొద్దని బాలీవుడ్లో ఛబ్రాకు పలువురు చెప్పారని అన్నారు. కానీ ముఖేష్ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లో నాలుగు పాటలు స్వరాలు కూర్చి ఇచ్చినట్టు వివరించారు.