Advertisement

  • అయ్యప్పనుమ్ సినిమా షూటింగ్ లో ఒకరు మృతి...!

అయ్యప్పనుమ్ సినిమా షూటింగ్ లో ఒకరు మృతి...!

By: Anji Sat, 26 Dec 2020 4:05 PM

అయ్యప్పనుమ్ సినిమా షూటింగ్ లో ఒకరు మృతి...!

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుం’లో సీఐ సతీష్ నాయర్‌గా నటించిన ప్రముఖ నటుడు అనిల్ నేదుమంగడ్ కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మళంకర డ్యామ్‌లో మునిగి మరణించారు.

ఆయన వయసు 48 సంవత్సరాలు. ‘అయ్యప్పనుమ్ కొషియుం’ సినిమాతో పాటు ‘కమ్మట్టిప్పాడమ్’, ‘పొరించు మరియమ్ జోసే’, ‘పావడ’ చిత్రాలతో కేరళలో అనిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కేరళ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అనిల్ రిజర్వాయర్‌లో మునిగిపోయారు. స్నేహితులతో కలిసి స్నానం చేయడానికి మళంకర రిజర్వాయర్‌లోకి దిగిన అనిల్.. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయారు.

సుమారు 30 నిమిషాల పాటు అనిల్ కోసం అన్వేషించిన స్నేహితులు ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తొడుపుడ జిల్లా ఆసుత్రికి తరలించారు. జోజు జార్జ్ హీరోగా రూపొందుతోన్న సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర బృందంతో కలిసి అనిల్ తొడుపుడ వెళ్లారు.


అనిల్ నేదుమంగడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి ముందు టెలివిజన్ ప్రెజెంటర్‌గా, ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆయన తొలి చిత్రం ‘నాన్ స్టీవ్ లోపెజ్’. రాజేష్ రవి దర్శకత్వం ద్వారా మలయాళ చిత్రసీమకు అనిల్ పరిచయమయ్యారు.

‘అయ్యప్పనుమ్ కొషియుం’ చిత్రంలో పోలీసు అధికారిగా అనిల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనిల్ చివరిగా ‘పాపం చెయ్యతవర్ కల్లేరియట్టే’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది.

కాగా, ఈ ఏడాది జూన్‌లో మరణించిన ‘అయ్యప్పనుమ్ కొషియుం’ చిత్ర దర్శకుడు సాచీ పుట్టినరోజు నేడు. ఆయన జయంతి రోజు అనిల్ కన్నుమూయడం దురదృష్టకరం. అనిల్ మృతి పట్ల మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Tags :

Advertisement