ఆ యాప్స్ తో జాగ్రత్త
By: Sankar Tue, 02 June 2020 8:50 PM
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. కరోనా ట్రాకింగ్ యాప్స్ పేరుతో బోలెడు యాప్స్ నెట్టింట్లో కనిపిస్తున్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే మొబైల్లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే అలాంటి హానికరమైన యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వినియోగదారుల ఫోన్లలో రాన్సమ్వేర్ను ఇన్స్టాల్ చేసేందుకు కరోనా ట్రాకింగ్ యాప్స్ పేరుతో కొన్ని యాప్స్ తయారుచేసి వదిలినట్టుగా నిపుణులు గుర్తించారు. ఒకవేళ అలాంటి అపరిచిత యాప్స్ను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు రకరకాల పర్మిషన్లు అడుగుతుంది. లాక్స్ర్కీన్, యాక్సెసబులిటీ వంటి పర్మిషన్లు తీసుకుంటుంది. ఒక్కసారి యాప్ ఆ పర్మిషన్లు పొందితే, ‘మీ స్మార్ట్ఫోన్ తిరిగి అన్లాక్ కావాలంటే మేము అడిగిన డబ్బులు చెల్లించండి’ అంటూ మెసేజ్ ప్రత్యక్షమవుతుంది.
అంతేకాకుండా ఫోన్లో ఉన్న కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలను ఫొన్ మెమొరీలో నుంచి తొలగిస్తామని భయపెడతారు. ప్రైవేటు వీడియోలు ఉంటే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగుతారు. అందుకే మొబైల్ వినియోగదారులు పాస్వర్డ్ పెట్టుకోవడంతో పాటు అపరిచిత యాప్స్ జోలికి వెళ్లవద్దని అపరిచితుల నుంచి మెయిల్స్ను ఓపెన్ చేయవద్దని, లింక్లను క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.