Advertisement

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం యొక్క విశిష్టత ..

By: Sankar Sun, 19 July 2020 5:24 PM

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం యొక్క విశిష్టత ..



మరి కొన్ని రోజుల్లో ఆషాడ మాసం పోయి తెలుగు వారికి అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం వస్తుంది ..అయితే ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ..

1. సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు జన్మించిన శ్రావణా నక్షత్రం పేరులో ఉచ్చే ఈ మాసమంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది..

2. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే.

3. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి , గరుడ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి.

4. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

5. శివుడికి శ్రావణమాసం అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్తు, కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరారాధన చేస్తారు.

6. శ్రావణమాసం మొదలైన నాలుగో రోజునే వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని పూజించడం హైందవ ఆచారం. పాలు, మిర్యాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు.

7.సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రదై ఏకాదశి అన్నారు.

8. శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. వరాలిచ్చే దేవత వరలక్ష్మీ వ్రతం వల్ల భర్తలకు ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుష్షు కలుగుతాయని విశ్వాసం

Tags :

Advertisement